కాల్పుల విరమణ లాభంలేదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత కాశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం కాల్పుల విరమణ పొడగించే ఆలోచన చేయరాదని ఆయన పేర్కొన్నారు.
గురువారం నాడు ఆయన ఢిల్లీలో ప్రధాని వాజ్పేయిని కేంద్ర హోం మంత్రి అద్వానీని కలసి రాష్ట్రంలో నెలకొని వున్న పరిస్థితిని నివేదించారు. ఈ నెల 26న కాశ్మీర్లో కాల్పుల విరమణ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం సమీక్షించనున్న విషయం విదితమే. కాల్పుల విరమణను ప్రభుత్వం మరికొంత కాలం పొడగించేఅవకాశం వున్నదని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఫరూఖ్ ఈ విషయంలో తమ విముఖతను స్పష్టంగా వ్యక్తంచేశారు.
కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణను పాటించడం వల్ల ప్రయోజనం పెద్దగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు కాశ్మీర్ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు గానీ పాకిస్తాన్గానీ స్పందించడం లేదని ఆయన చెప్పారు. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్న తర్వాతనే గతంలో కన్నా మిన్నగా రాష్ట్రంలో తీవ్రవాదుల ఆకృత్యాలు పెరిగిపోయాయని ఫరూఖ్ ఆరోపించారు. హూరియత్ కాన్ఫరెన్స్ సభ్యులు పాకిస్తాన్ వెళ్లే విషయంలో తనకు అభ్యతరం లేదని అయితే ఈ పర్యటన వల్ల ఒనగూడేది ఏమీలేదని ఆయన వ్యాఖ్యనించారు.