దేశంకు బిజెపికరెంట్ షాక్
హైదరాబాద్: కరెంట్ ఛార్జీల పెంపుపై తమ సిఫార్సులను తుది నివేదికలో పొందు పర్చకపోవడంపై రాష్ట్ర బిజెపి తెలుగుదేశం ప్రభుత్వంపై నిరసన గళం విప్పింది. విద్యుత్ ఛార్జీల పరిశీలనకు అసెంబ్లీ ఏర్పాటు చేసిన సభా సంఘం నివేదికలో తాము చేసిన ముందుగా అంగీకరించి తుది నివేదికలో పొందు పరచలేదని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో విమర్శించారు.
తన సిఫారసులను నివేదిక చిత్తుప్రతిలో పొందుపరిచి తుది నివేదికలో తొలగించారని ఆయన చెప్పారు. వాటిని తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ప్రతిభా భారతికి ఒక లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఈ లేఖను ఆయన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు.
ఇతర రాష్ట్రాల విద్యుచ్ఛక్తి బోర్డులతో పోలిస్తే మన విద్యుత్ సంస్థల పనితీరు బాగా లేదని, అయితే మన ట్రాన్స్కో, జెన్కో పనితీరు అద్భుతంగా వున్నదని నివేదికలో చెప్పారని ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ట్రాన్స్కో, జెన్కోల పనితీరు బాగా లేనందుననే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్ద మొత్తం ధారపోయాల్సి వస్తోందని, ప్రజలపై మోయలేని భారాన్ని వేసిన సంగతి అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు.
వ్యవసాయ కనెక్షన్లు అధికంగా వున్నందున, వ్యవసాయానికి సబ్సిడీ ఇస్తున్నందున నష్టాలు వస్తున్నాయనే ట్రాన్స్కో వాదనలో కూడా నిజం లేదని ఆయన చెప్పారు. తాము తమిళనాడు, తదితర రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత ఈ విషయాలు తేలాయని ఆయన చెప్పారు.