హిందూజా సోదరులకు బెయిల్
న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల బోఫోర్స్ ముడుపుల కేసులో నిందితులైన ప్రవాస భారతీయ వ్యాపారులు హిందూజా సోదరులకు శుక్రవారం నాడు ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
రెండు లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరికొన్ని షరతులతో హిందూజా సోదరులు ముగ్గురికి న్యాయమూర్తి అజిత్ భరిహోక్ బెయిల్ మంజూరు చేశారు. విచారణ పూర్తయ్యేంతవరకు హిందూజా సోదరులు దేశం విడిచి వెళ్లరాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు గానూ తాము అమెరికాకు వెళ్లడానికి అనుమతినివ్వాలని హిందూజా సోదరులు తమ న్యాయవాది ద్వార చేసిన విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. అయితే ఈ విజ్ఞప్తిని న్యాయమూర్తి తర్వాత పరిశీలించే అవకాశం వున్నదని తెలిసింది.
శుక్రవారం నాడు కోర్టుకు హాజరైన హిందూజాలు ఈ కేసుకు సంబంధించి తమ వాదనలను వినిపించారు. సిబిఐ తమ పై చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. కాగా హిందూజా సోదరులను ప్రశ్నించడానికి అనుమతినివ్వాల్సిందిగా సిబిఐ చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ, హిందూజాల న్యాయవాదితో మాట్లాడి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవల్సిందిగా సిబిఐకి న్యాయమూర్తి సూచించారు. ఇదే కేసులో నిందితుడైన ఇటలీ వ్యాపారి ఖత్రోచికి వ్యతిరేకంగా జారీ చేసిన నాన్బెయిలెబుల్ వారెంట్ను కాలపరిమితిని న్యాయమూర్తి పొడగించారు.