నీరు-మీరుతో సస్యశ్యామలం
హైదరాబాద్: నీరు-మీరు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. శ్రమదానం ద్వారా దీనిని పరిపుష్టం చేయాలని ఆయన కోరారు. నీరు-మీరు రెండో విడత కార్యక్రమానికి ఆయన అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ప్రారంభోత్సవం చేశారు.
పెన్నానదిపై చేపట్టిన డ్రెయిన్కు ఆయన ప్రారంభోత్సవం చేశారు. నీరు మీరు కార్యక్రమంలో చొరబడేందుకు ప్రయత్నించే కాంట్రాక్టర్లపై తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. భూగర్భ జలాల మట్టాన్ని పెంచడానికి ప్రయత్నించడం ద్వారా నీటి సమస్యను తీర్చవచ్చని ఆయన చెప్పారు.
నీరు మీరు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటే నాలుగయిదేళ్ల కాలంలో రాష్ట్రంలో దుర్భిక్షం అన్నది లేకుండా చేయవచ్చని ఆయన చెప్పారు. రానున్న కాలంలో 236 కోట్ల రూపాయలను వెచ్చించి సాగునీటి వనరులను అభివృద్ధి చేయనున్నట్టుగా బంజరులను సాగులోకి తీసుకురానున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు.