బిజెపిపై నిప్పులు చెరిగిన బాబు
హైదరాబాద్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీరుపై తాడోపేడో తేల్చుకోకతప్పదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి తీరు పట్ల ఆయన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గురువారం ఆయన తన నివాసం నుంచి మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
చేనేత రంగానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయంటూ బిజెపి నేతలు బుధవారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పలు చేనేత సహకార సంఘాలకు ఆప్కో 27 కోట్ల రూపాయలు బకాయి పడిందని చేనేత, జౌళి శాఖ మంత్రి పడాల భూమన్న ముఖ్యమంత్రికి చెబుతూ ఈ సమస్య పరిష్కారానికి నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా బిజెపి విమర్శలపై చర్చ జరిగింది. ఈ నెల 24వ తేదీన నేను ఢిల్లీ వెళ్లి బిజెపి నాయకుల వైఖరిని వాజ్పేయికి వివరిస్తాను. వారి తీరు మారిందా సరే లేకుంటే వారి ఖర్మ అని ముఖ్యమంత్రి అన్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. బిజెపి రాష్ట్ర నేతలు చేసిన విమర్శల పేపర్ క్లిప్పింగ్లను కూడా తాను ఢిల్లీకి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో బిజెపి వల్లే తాము అధికారంలోకి వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారని, వారి బలాన్ని అతిగా ఊహించుకుంటున్నారని, వారు అధికారంలోకి వచ్చేసినట్లు కలలు కంటున్నారని, వారి వ్యవహారం అతిగా వున్నదని ఆయన అన్నారు. రెండు పార్టీ సమన్వయ సంఘాన్ని వేస్తే సమస్యలను కొని తెచ్చుకున్నవారమవుతామని చంద్రబాబు అన్నారు. వారి వైఖరిని ఇప్పటి వరకు సామరస్యంతో జీర్ణించుకున్నామని, ఇక దీనికి స్వస్తి చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి నేతలు విమర్శలు చేస్తే తెలుగుదేశం వారు వెంటనే వారిని దుయ్యబట్టాలని ఆయన అన్నారు.