ప్రచారానికి వాజ్పేయిశ్రీకారం
చెన్నై: తమిళనాడులో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎన్డిఎ అగ్రనేత, ప్రధాని వాజ్పేయి శుక్రవారం నాడు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ప్రజల అకాంక్షలు, ఆశలకు ఎన్డిఎ ప్రతీక అని ఆయన చెప్పారు.
ప్రజల ఆశయాలను పూర్తిచేసే దిశలో తమ ప్రభుత్వం సాగుతున్నదని కోయంబత్తూర్లో ఏర్పాటయిన స్వదేశీ పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రారంభోత్సవం చేస్తూ ఆయన చెప్పారు. రాష్ట్రంలో డిఎంకె నాయకత్వంలోని కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పిఎంకె తమ కూటమినుంచి వైదొలిగినందువల్ల వచ్చే నష్టమేమీ లేదని కూడా ప్రధాని చెప్పారు. పిఎంకె చర్య వల్ల కేంద్ర ప్రభుత్వ సుస్థిరతకు భంగం కలుగుతుందన్న సందేహాలను ఆయన తోసిపుచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిపై ప్రశంసల జల్లు కురిపించారు.
తమిళనాడులో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం కరుణానిధితో తమ సయోధ్యపై ఏమాత్రం వుండదని ప్రధాని స్పష్టం చేశారు. ఇదిలా వుండగా అంతకుముందు ఐఎఎఫ్ ప్రత్యేక విమానంలో ఇక్కడకు వచ్చిన ప్రధానికి ఘన స్వాగతం లభించింది.