పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో శుక్రవారం నాడు ఒక మతానికి చెందిన అల్లరిమూకలు విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించాయి. ఈ సందర్భంగా కొన్ని గంటలపాటు నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
చార్మినార్ వద్ద వున్న ఒక ప్రార్ధనా స్థలంలోపలినుంచి శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనలు జరిగిన తర్వాత అల్లరిమూకలు పథకం ప్రకారం బయట జనంపై రాళ్ల రువ్వడం ప్రారంభించాయి. ఒక్కసారిగా రాళ్లు వర్షంలా వచ్చిపడుతుండటంతో జనం భయభ్రాంతులతో పరుగులు తీశారు. బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. పోలీసులు అప్రమత్తమై రాళ్లురువ్వుతున్న వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు గుంపులు గుంపులుగా విడిపోయి పోలీసులకు అందకుండా పరుగులు తీశారు. ఈ గుంపుల్లోని ఒక మూక చార్మినార్ బస్ టెర్మినల్ వద్ద మూడు బస్సులను రాళ్లు రువ్వి ధ్వంసం చేసింది. ఒక ప్రముఖ పత్రిక ఫొటో గ్రాఫర్ను దుండగులు రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చారు. మరో ఏడుగురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
అఎn్ఘానిస్తాన్లో బుద్ధవిగ్రహాల కూల్చివేతకు నిరసనగా ఢిల్లీలో పవిత్రగ్రంథాన్ని ఒక వర్గం వారు దహనం చేశారంటూ స్థానిక పత్రికలో వచ్చిన రెచ్చగొట్టే విధంగా వున్న వార్త, పాతబస్తీ అంతా వెలసిన కొన్ని పోస్టర్లు శుక్రవారం నాటి సంఘటనలకు కారణమని పోలీసులు చెప్పారు. సంఘటనలకు బాధ్యులైనవారిని అదుపులోకి తీసుకుంటున్నట్టుగా వారు వెల్లడించారు.