ఎన్డిఎ బస్తీమే సవాల్
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వానికి కాంగ్రెస్ విసిరిన సవాలును స్వీకరిస్తున్నట్టుగా ఎన్డిఎ నేతలు ఆదివారం నాడు ఢిల్లీలో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రకటించారు. ప్రభుత్వాన్ని నడపడం మాత్రమే కాదని తాము ప్రజల్లోకి వెళ్లి ప్రజల మద్దతు తమకే వున్నదని నిరూపిస్తామని ప్రధాని వాజ్పేయి పేర్కొన్నారు.
బెంగుళూరు ప్లీనరీలో ఎన్డిఎ ప్రభుత్వం గద్దె దిగేవరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, హోం మంత్రి అద్వానీ, పార్టీ కొత్త అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి, రాం విలాస్ పాశ్వాన్, శరద్యాదవ్ పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
సోనియా తనను దేశద్రోహి అని సంభోదించడాన్ని ప్రధాని వాజ్పేయి విమర్శించారు. ఈ దేశంలో అవినీతి వేళ్లూనుకుపోవడానికి కాంగ్రెస్ కారణమని ఆయన అన్నారు. మూడేళ్లలో దీనిని నిర్మూలించడానికి తాము తమ చేతనైన ప్రయత్నాలు చేశామని ఆయన తెలిపారు.