విశాఖ ఎన్టీపిసిలో ఆరుగురు దుర్మరణం
విశాఖపట్నంఃవిశాఖపట్నం ఎన్.టి.పి.సి.లో బుధవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులువిశాఖపట్నంలోని ఎం.జి.ఎం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పని చేస్తున్న సమయంలో కూలింగ్ టవర్ కుక్రైన్ తగలడంతో టవర్ లో కొంతభాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో సుమారు 25 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నారు. ప్రమాదాన్ని గుర్తించి వారంతా పరుగులు తీయడంతోపెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సూపర్ వైజర్, క్రేన్ డ్రైవర్ తో పాటు నలుగురు కార్మికులు మరణించారు. మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు.
సింహాద్రి విద్యుత్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే తొందర తప్ప ఇక్కడ పని చేస్తున్న సుమారు పదివేల మంది కార్మికుల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు.యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.