వేడుకగా దేశం వ్యవస్థాపక దినం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 20 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం పతాకావిష్కరణ చేసిన తర్వాత పార్టీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర నిర్వహిస్తున్నదని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయ చైతన్యాన్ని తెలుగుదేశం పార్టీ తెచ్చిందని ఆయన అన్నారు.
ప్రజల విశ్వాసమే పార్టీల మనుగడకు ఆధారమని ఆయన చెప్పారు. క్రమశిక్షణతో, కష్టపడి పనిచేస్తూ ప్రతికార్యకర్త ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం 50 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. ఎన్డిఎలో బీజేపీ తర్వాత అదిపెద్ద పార్టీగా వున్న తెలుగుదేశం పదవుల కోసం ఆశించకుండా కేవలం దేశప్రయోజనాలే పరమార్థంగా ఎన్డిఎ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతు ఇస్తున్నదని ఆయన చెప్పారు.