సాక్షుల వేధింపు సబబు కాదు
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల విచారణలో సాక్షులను ప్రతివాయిదాకు కోర్టుకు తిప్పడాన్ని తప్పుబడుతూ సుప్రీం కోర్టు గురువారం నాడు సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా వున్న దిగువ కోర్టులన్నింటికీ వర్తించే ఈ ఆదేశాల్లో, సాక్షులను న్యాయవిచారణకు ఉపకరించేందుకు వచ్చిన అతిథులుగా పరిగణించాలని న్యాయమూర్తులు హితువు చెప్పారు.
ప్రతివాయిదాకు సాక్షులను కోర్టుల చుట్టూ తిప్పకుండా సాక్షి కోర్టుకు వచ్చిన రోజునే వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని సుప్రీ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ థామస్, జస్టిస్ సేథ్తో కూడిన డివిజన్ బెంచి ఆదేశించింది. కోర్టునుంచి సమన్లు అందాయంటే చాలు భారత్లో సాక్షుల వణికిపోతారని న్యాయమూర్తి జస్టిస్ థామస్ వ్యాఖ్యానించారు.
కోర్టులో ప్రశ్నలు అడుగుతారని, క్రాస్ఎగ్జామిన్ చేస్తారనే భయం కన్నా ఎక్కువగా వారిని ఎన్ని సార్లు కోర్టు చుట్టు తిరగాలో, వెళ్లిన ప్రతిసారి ఎన్ని గంటలు పడిగాపులకాయలో అన్న భయం బాగా వేధిస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాపకాలన్నింటినీ పక్కనపెట్టి కోర్టుకు వచ్చే సాక్షులను న్యాయస్థానాలు రోజంతా వేచివుండేలా చేసి చివరకు మరో రోజు రమ్మని పంపడం ఏ మాత్రం తగదని ఆయన పేర్కొన్నారు. వాదులు, ప్రతివాదుల కన్నా కోర్టుల్లో సాక్షుల స్థితే దయనీయంగా వుంటుందని ఆయన అన్నారు.