బిగ్ బుల్ కేతన్ పరేఖ్అరెస్టు
ముంబయ్ః ప్రస్తుత స్టాక్ మార్కెట్ సంక్షోభానికి సూత్రధారిగా భావిస్తున్న బిగ్ బుల్ కేతన్ పరేఖ్ ను సి.బి.ఐ. శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది.పలు అక్రమ లావాదేవీలకు పాల్పడడంతో పాటు ప్రస్తుత సంక్షోభానికి కేతన్ పరేఖ్ బాధ్యుడని సిబిఐ భావిస్తున్నది. కేతన్ ను అరెస్టు చేసిన సిబిఐ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. దీనితో పాటు అక్రమ లావాదేవీలకు నిలయంగా మారిన కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ కూడా కుదుపులకు గురైంది. కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు శుక్రవారం రాజీనామా చేసింది.
అంతకు ముందు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుపై కేతన్ పరేఖ్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. పరేఖ్ బ్యాంకును మోసం చేశాడనేది ఆ ఫిర్యాదు సారాంశం. మహదేవ్ పూర్ కో-ఆపరేటివ్ బ్యాంకు పేఆర్డర్ల కుంభకోణం వార్తలతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలి పోయాయి.
1992లో భారత స్టాక్ మార్కెట్లలో పెను సంక్షోభానికి కారకుడైన హర్షద్ మెహతాకు కేతన్ పరేఖ్ సన్నిహితుడు. కేతన్ వెనుకు హర్షద్ హస్తం కూడా వున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి భారత స్టాక్ మార్కెట్లను సంక్షోభం పాలు చేసిన కేతన్ పరేఖ్ పలు బ్యాంకులను బురిడీ కొట్టించాడనే ఆరోపణలు కూడా వున్నాయి. అయితే ఇప్పటి వరకు నామమాత్రంగా వున్న ఆరోపణలు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో కేసు రూపం తీసుకున్నాయి. కేతన్ పై ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదైంది. ఈ వ్యవహారం స్టాక్ మార్కెట్ లను ఏ దారికి తీసుకువెళుతుందో వేచి చూడాలి.