డాట్ కాంల నెత్తిన మీడియా కౌన్సిల్
న్యూఢిల్లీః ప్రెస్ కౌన్సిల్ స్ధానే మీడియా కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియాను, పోర్టల్స్, వెబ్సైట్లను కొత్త కౌన్సిల్ పరిధిలోకి తీసుకువస్తారు. మీడియా కోడ్ ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ కౌన్సిల్ కు తగిన అధికారాలు కల్పిస్తారు.ఈవిషయాన్ని కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం ఇక్కడ వెల్లడించారు.
దీనికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు ఆమె చెప్పారు. తహల్కా డాట్ కాం వెలికితీసిన అవినీతి నేపధ్యంలో వాజ్పేయి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడాన్ని ఆమెవిమర్శించారు. అద్దాల భవనంలో ఉంటున్నవారు ఇతరుపై రాళ్ళు వేయరాదని ఆమె అన్నారు.తహల్కాపరిశోధన కొందరి ప్రేరేపణతో మరికొందరిని అప్రదిష్టపాలుచేయడానికి ఉద్దేశించినదా లేక నిజంగా ఈ వ్యవస్ధలో అవినీతిని రూపుమాపడానికి ఉద్దేశించినదా అనే దానిని నిగ్గు తేల్చడానికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆమె తెలిపారు.