నిరాయుధీకరణకు కట్టుబడి వున్నాం: జస్వంత్
వాషింగ్టన్: భారత్ నిరాయుధీకరణకు కట్టుబడి వుంటుందని భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ చెప్పారు. జమ్మూకాశ్మీర్లో శాంతి స్థాపనకు కాశ్మీర్ తీవ్రవాదులతో భారత్ చర్చలు జరపాలనుకుంటున్న నిర్ణయాన్ని అమెరికా హర్షించింది. అమెరికా విదేశాంగ మంత్రి కోలెన్ పావెల్తో చర్చలు జరిపిన అనంతరం జస్వంత్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. సిటిబిటిపై సంతకం చేసే విషయంలో తమపై ఎక్కడి నుంచి కూడా ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సంయమనంతో భారత్, అమెరికాలు ముందుకు సాగే దిశలో ఉభయ దేశాల మధ్య చర్చలు జరగాల్సి వుందని ఆయన అన్నారు.
అమెరికా, భారత్ల మధ్య మైత్రీసంబంధాలకు ఏ విధమైన విఘాతం కలగలేదని ఆయన చెప్పారు. అమెరికా భారత్పై విధించిన ఆంక్షలు ఎత్తేయకపోవడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఏ విధమైన విఘాతం కలగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగైనట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోని రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య స్నేహ సంబంధాలు ప్రపంచంలో శాంతికి, సుస్థిరతకు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య విభేదాలున్నాయనేది అబద్ధమని ఆయన అన్నారు. సమస్యలను ఇరు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకునే వీలుందని ఆయన చెప్పారు.