బాబ్రీ కమిషన్ ముందు పీవీ హాజరు
న్యూఢిల్లీ:బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యత అంతా అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ సింగ్ దే నని పి.వి. స్పష్టం చేశారు. వివాద పరిష్కారానికి పి.వి. చొరవచూపలేదంటూ అప్పటి హోం శాఖ కార్యదర్శి గాడ్బోలే చేసిన ఆరోపణలను పి.వి. ఖండించారు. తనకు హోం శాఖ నుంచి ఏ మాత్రం మద్దతు లభించలేదని ఆయన చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరపడం మినహా కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని, తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించానని పి.వి. లిబర్ హాన్ కమిషన్ కు చెప్పారు. బాబ్రీ మసీదు విధ్వంసంపై విచారణ జరుపుతున్న జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ముందు మాజీ ప్రధాని పివి నరసింహారావు సోమవారం నాడు మరోసారి హాజరయ్యారు. లిబర్హన్ కమిషన్ ముందు ఆయన హాజరుకావడం ఇది మూడో సారి. గత ఫిబ్రవరీలో హాజరైనప్పుడే బాబ్రీ విధ్వంసానికి అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్సింగ్ ప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత అని పివి వాంగ్మూలం ఇచ్చారు.
మసీదు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టమైన హామీ ఇచ్చిన కారణంగానే తాము రాష్ట్రపతి పాలన వంటి అసాధారణ చర్యలను తీసుకోలేదని కూడా పివి అప్పట్లోనే వివరించారు. బాబ్రీ విధ్వంసానికి దారి తీసిన పరిస్థితులపై తనకు తెలిసిన విషయాలను కమిషన్ ముందు పివి వెల్లడించారు. అప్పట్లో బాబ్రీ విషయాలను తన మంత్రి వర్గంలో హోం శాఖను నిర్వహించిన ఎస్బి చవాన్ చూసుకునే వారని కూడా కమిషన్ ముందు పివి చెప్పారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకుఅప్పటి ప్రధానిగా తన బాధ్యత ఎంతమేరకు అనేవిషయంపై కమిషన్ పివి వివరణను కోరిన విషయంవిదితమే. గత రెండు పర్యాయాలు ఆయన ఇచ్చినవివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో మరోసారి ఆయన్ను కమిషన్వివరణకు ఆదేశించింది.