త్రిశంకు స్వర్గంలో జయలలిత
చెన్నయ్ః అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ఇంకా త్రిశంకుస్వర్గంలోనే వున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆమె చేసుకున్న అభ్యర్థనపై తీర్పును తమిళనాడు హైకోర్టు మంగళవారం వాయిదా వేసింది.పైగా రాష్ట్ర ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడరాదంటూ ఆమె చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది.
రాష్ట్ర ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిరభ్యంతరంగా ఉపయోగించు కోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. దీనితో తమిళనాడుఅసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగానికి అభ్యంతరాలు తొలగి పోయాయి. మరోవైపు జయలలిత ఎన్నికల్లో పోటీ చేసేందుకు వున్న అవరోధాలపై హైకోర్టు తన అభిప్రాయాన్ని ఇంకా వెల్లడించలేదు. జయకు రెండు కేసుల్లో ఐదేళ్ళ జైలు శిక్ష పడినవిషయం విదితమే.
అయితే ఆ శిక్ష అమలును కోర్టు వాయిదా వేసింది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం జైలుశిక్ష పడిన వారు ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేసేవీలు లేదు. శిక్ష అమలును న్యాయస్థానం వాయిదా వేసిన దరిమిలా తనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని జయలలిత చెన్నయ్ హైకోర్టుకువిజ్ఞప్తి చేశారు. ఆ కేసుపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. దీనితో జయలలిత ఎన్నికల్లో పోటీ చేసేఅంశంపై సందిగ్ధత కొనసాగుతూ వుంది.