విశాఖ ఎయిర్పోర్టుకు కొత్త హంగులు
విశాఖపట్నం: దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా శరవేగంతో విస్తరిస్తున్న విశాఖపట్నంలో సరైన విమానాశ్రయం లేకపోవడం నగర అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా వున్నదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందువల్ల 125 కోట్ల రూపాయలతో రానున్న ఏడాదిన్నర కాలంలో విశాఖ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం వ్యయంలో 25 కోట్ల రూపాయలను బడ్జెట్లోనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన మొత్తాన్ని ఎయిర్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తాయి. ఎయిర్బస్ల లాండింగ్, నైట్ సర్వీసుల లాండింగ్కు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు రన్వేను విస్తరించనున్నట్టుగా జిల్లా అధికారులు చెప్పారు. పారిశ్రామికంగా దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా విశాఖ ఇప్పటికే పేరు తెచ్చుకున్నప్పటికీ సరైన విమానాశ్రయం అతిపెద్ద కొరతగా వుంది. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన స్థల సేకరణకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది.