బెంగాల్పై జ్యోతిబసు ధీమా
కోల్కతా: కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కలసి మహా కూటమిని ఏర్పాటు చేసినప్పటికీ పశ్చిమ బెంగాల్లో వామపక్ష ఫ్రంట్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు 24 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా తాను అందించిన సేవలను గుర్తించారని ఆయన చెప్పారు.
కాంగ్రెస్, తృణమూల్ ఎన్నిప్రయత్నాలు చేసినా చివరకు విజయం తమనే వరిస్తుందని ఆయన వెల్లడించారు. ఇదిలా వుండగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల తొలిజాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ నేత ఘనీఖాన్ చౌధరితో సంప్రదించి ఈ తొలి జాబితాను ఖరారు చేసినట్టుగా కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. కాగా తృణమూల్తో కాంగ్రెస్ పొత్తుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అసమ్మతివాదులు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బచావో పార్టీ కూడా అన్ని స్థానాల్లో తమ అభ్యర్ధులు పోటీ చేస్తారని ప్రకటించింది.