విఫలమైన అఖిలపక్షం
న్యూఢిల్లీ: ప్రధాని వాజ్పేయి శనివారం నాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, ఆర్జెడి గైరాజరయ్యాయి. వామపక్ష పార్టీలు మాత్రం ఈ సమావేశానికి హాజరయ్యాయి. తహల్కా వ్యవహారంలో ఎన్డిఎ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రతిపక్ష పార్టీలు స్తంభింపజేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న రెండో విడత సమావేశాలు సజావుగా సాగేలా చూడటానికి ప్రధాని చొరవ తీసుకుని శనివారం నాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
లోకసభ స్పీకర్, రాజ్యసభ సభాపతి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కూడా హాజరయిన ఈ సమావేశానికి కాంగ్రెస్ హాజరయ్యే విషయంలో మొదటినుంచే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వాజ్పేయి ప్రభుత్వం గద్దె దిగాలన్నదే తమ డిమాండ్ అని ఈ డిమాండ్ నెరవేరే వరకు పార్లమెంట్ సమావేశాలను సాగనివ్వమని ఆర్జెడి స్పష్టం చేసింది. అందువల్లనే తాము సమావేశానికి గైరాజరయినట్టుగా ఆర్జెడి ప్రతినిధులు చెప్పారు.
కాగా జైపూర్లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత ఎన్డిఎ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడాన్ని బట్టి పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా సాగనివ్వడానికి కాంగ్రెస్ అంగీకరించకపోవచ్చనే అంతా భావిస్తున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో తహల్కా తో పాటు ఆయోధ్యపై లిబర్హాన్ కమిషన్ ముందు హోం మంత్రి ఇచ్చిన వాంగ్మూలం పై కూడా కాంగ్రెస్ గొడవ చేసే అవకాశం వుంది