బాబుపై చంద్రశేఖర్ లేఖాస్త్రం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణా నినాదంతో అధికారపార్టీనుంచి బయటకొచ్చిన డిప్యూటి స్పీకర్ చంద్రశేఖర్రావు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైకి లేఖాస్త్రాన్ని సంధించారు. సిఎంకు రాసిన తొలి బహిరంగ లేఖతో ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి సంబంధించిన తన కార్యకలాపాలకు ఆయన శ్రీకారం చుట్టారు.
తెలంగాణా ప్రాంతంలో ప్రభుత్వఉద్యోగాల్లో వున్న తెలంగాణేతరుల స్థానంలో తెలంగాణాకు చెందిన వారిని నియమించాలని లేఖలో చంద్రశేఖర్రావు చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ విషయంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జారీ చేసిన జీవోను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో తెలంగాణాకు తీరని అన్యాయం జరుగుతున్నదని చంద్రశేఖర్రావు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు తెలంగాణా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వున్నట్టుగా ఆయన చెప్పారు.
ప్రత్యేక తెలంగాణా సాధనకోసం తాము ప్రారంభించిన ఉద్యమం లక్ష్యం సిద్ధించేవరకు ఆగదని ఆయన స్పష్టం చేశారు. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే ఖరారు చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు. రానున్న పంచాయతీ ఎన్నికలు ప్రత్యేక తెలంగాణా డిమాండ్ కేంద్రంగానే జరుగుతాయని ఆయన చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణాకు తీరని అన్యాయం చేసిందని, అదే సమయంలో బిజెపి కూడా అడగకుండానే తెలంగాణా ఇస్తామని హామీ ఇచ్చి మాటమార్చిందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణా సమస్యలపై చలనచిత్రాన్ని కూడా రూపొందిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.
ఇదిలా వుండగా చంద్రశేఖర్రావు అధికారపార్టీతో తన అనుబంధాన్ని తెంచేసుకున్నట్టుగా తెగేసి ప్రకటించినప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఇంతవరకు ఏలాంటి ప్రతిస్పందన లేదు. గత శనివారం నాడు జరిగిన తెలుగుదేశం పోలిట్బ్యూరో సమావేశంలో చంద్రశేఖర్రావు వ్యవహారం ప్రస్తావనకు వచ్చినా, వేచిచూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించారు. నిన్నమొన్నటి వరకు ఏ విషయం బహిరంగంగా ప్రకటించకుండా దాగుడుమూతలాడిన చంద్రశేఖర్రావు ఇప్పుడు నేరుగానే తెలంగాణా ఉద్యమాన్ని గురించి ప్రకటనలు చేస్తున్నారు.