మందుపాతరకు ఎస్ఐ సహా నలుగురు బలి
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల ఏజెన్సీ ప్రాంతంలో పీపుల్స్వార్ నక్సలైట్లు అమర్చిన మందుపాతర పేలి గురువారం నలుగురు పోలీసులు మరణించారు. మరణించినవారిలో ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)తో పాటు ముగ్గురు కానిస్టేబుల్స్ వున్నారు. ఈ సంఘటన వై.రామవరం మండలంలోని ఒక గ్రామం వద్ద జరిగింది. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఎస్ఐ నరేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ డి.వి. రెడ్డి, అంజయ్య, ఎస్. దుర్గాప్రసాద్ మందుపాతరకు బలయ్యారు.
పీపుల్స్వార్ మందుపాతరలు అమర్చినట్లు సమాచారం అందడంతో 30 మందితో కూడిన ప్రత్యేక పోలీసు బృందాలు వాటిని అన్వేషించే పనిలో గత రెండు రోజులుగా నిమగ్నమయ్యాయి. పోలీసులు పది మందుపాతరలను కనుగొని తొలిగించారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పోలీసులు ఒక మందుపాతరను తొలగిస్తుండగా అది పేలింది. దీంతో నలుగురు పోలీసులు మరణించారు. ప్రాణాపాయ స్థితిలో వున్న ఇద్దర్ని హెలికాప్టర్లో రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. మరణించినవారి మృతదేహాలను పోస్ట్మార్టమ్ నిమిత్తం రాజమండ్రికి తరలించారు.