దత్తత కేంద్రాలపై అధికారుల దాడి
హైదరాబాద్: హైదరాబాద్లోని గాంధీనగర్లో వున్న ఒక ఎన్జివో కు చెందిన హోం పై శుక్రవారం నాడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు దాడి జరిపి హోంలో వున్న 32 మంది పసివాళ్లను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనే సంస్థ నిర్వహిస్తున్న హోం పై దాడి జరిపిన అధికారులు ఇక్కడి శిశువులను శిశువిహార్కు పంపారు.
ఈ సందర్భంగా ఈ హోం నిర్వాహకుడైన సంజీవరావు అనే వ్యక్తికి అధికారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. పసివాళ్లను తన హోం నుంచి తీసుకుపోవడానికి తాను అంగీకరించనని సంజీవరావు చెప్పగా, అసలు పిల్లలను ఎక్కడనుంచి హోంకు తెచ్చింది, ఎప్పుడు తెచ్చింది వివరాలన్నీ ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారు. గతంలో కూడా రాష్ట్రంలో శిశువుల విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఈ కేంద్రంపై అధికారులు దాడి జరిపి కేసు నమోదు చేశారని అధికారులు వెల్లడించారు.
అయినా ఈ కేంద్ర నిర్వాహకులు తమ కార్యక్రమాలను మానలేదని వారు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోనూ చుట్టుపక్కల జిల్లాల్లోనూ వున్న తండాల్లో ఆడశిశువుల అమ్మకాలు సాగుతున్న విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం దీని వెనక దత్తత కేంద్రాల హస్తం వుండవచ్చనే అనుమానికి వచ్చింది. శిశువులను కొనుగోలు చేసి దేశంలోనూ, విదేశాల్లోనూ పిల్లలు లేనివారికి దత్తత ఇస్తూ కోట్లాది రూపాయలను కొన్ని సంస్థలు ఆర్జిస్తున్నట్టుగా వార్తలు రావడంతో అధికారులు ఈ దత్తత కేంద్రాలపై దాడులు ప్రారంభించారు.