దత్తత కేంద్రంలో పసికందుల మృతి
హైదరాబాద్: దత్తత కేంద్రాలపై అధికారుల దాడిలో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా తాండూరులోని జాన్ అబ్రహం బెథింగ్ హోంలో గత ఇరువైనాలుగుగంటల్లోనే ఇద్దరు పసిపిల్లలు అనారోగ్యంతో మరణించినట్టుగా తెలిసింది.
ఈ హోంలో గత మూడు నెలలకాలంలో 18 మంది ముక్కుపచ్చలారని పసిపాపలు కన్నుమూయగా వారిని హోం ఆవరణలోనే పూడ్చిపెట్టినట్టుగా శనివారం నాడు అధికారుల దర్యాప్తులో వెల్లడయింది. ఈ హోంకు సంబంధించి మరో పదిమంది పసిపాపల పరిస్థితి సీరియస్గా వుండటంతో వారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ హోంలో మొత్తం 63 మంది పాపలు వున్నారు. వారందరినీ హైదరాబాద్లోని శిశువిహార్కు తరలించారు. శుక్రవారం నాడు గాంధీనగర్లోని ఒక దత్తత కేంద్రం నుంచి కూడా 30 మంది పసివాళ్లను అధికారులు శిశువిహార్కు తరలించారు.
రంగారెడ్డి, మహబూబ్నగర్, కర్ణాటక సరిహద్దుల్లోని తండాల్లోంచి ఆడపిల్లలను ఆయిదువందలు, వెయ్యిరూపాయలకు కొనుక్కువచ్చి, దత్తత పేరిట వేలాది రూపాయలకు వీరిని ఈ కేంద్రాలవారు విక్రయిస్తున్నట్టుగా అధికారులు ఆరోపిస్తుండగా, తండాల్లో ఆడపిల్లలను తల్లితండ్రులే చంపివేస్తున్నారని అందువల్ల తాము తీసుకువచ్చి వారిని ఆదరిస్తున్నామని ఈ కేంద్రాల నిర్వాహకులు వాదిస్తున్నారు.
కాగా శనివారం నాడు తాండూరు కేంద్రం నిర్వాహకురాలు సావిత్రమ్మ జాడ గురించి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె అమెరికాలో వున్నారని, ఎక్కడవున్నారో తమకు తెలియదని కేంద్రంలో పనిచేసే ఆయాలు రకరకాల సమాధానాలు చెప్పడంతో బహుశ ఆమె పరారీ అయివుంటారని అధికారులు భావిస్తున్నారు.