బెతానీహోం సిబ్బంది 8 మందిఅరెస్టు
హైదరాబాద్ః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆడశిశువుల విక్రయాలకు సంబంధించిన కేసులో పోలీసులు మంగళవారం రాత్రి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరు లోని బెతానీ హోం మేనేజర్ రాజన్ తో పాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో రాజన్ భార్య రేణుక, కూతురు కృపామణి కూడా వున్నారు.
మరో వైపు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారు నగరంలో రెండు ప్రదేశాలపై దాడులు జరిపి మొత్తం 12 మంది ఆడ శిశువులను స్వాధీనం చేసుకున్నారు. మెహిదీ పట్నం లోని రాధాకిషన్ హోం, చింతల్ బస్తీలోని బెతానీ హోం ల నుంచి స్వాధీనం చేసుకున్న ఈ 12 మంది శిశువులను మొదట స్టేట్ హోంకు తరలించారు. వీరిలో కొందరు అస్వస్థతతకు గురికావడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
బెతానీ హో నిర్వాహకురాలు ప్రస్తుతం పరారీలో వున్న విషయం విదితమే. ఈమెను పట్టిఇచ్చిన వారికి ప్రభుత్వ లక్ష రూపాయల బహుమానం ప్రకటించింది. బెతానీ హోం గుట్టు రట్టు రట్టు కావడంతో ఆ సంస్థ సిబ్బంది తెలివిగా ఆరుగురు పిల్లలను తాండూరు నుంచి నగరానికి తరలించారు. వీరు మకాం వేసిన ఎ.సి. గార్డ్స్ వీర్ నగర్ లోని ఇంటిపై సైఫాబాద్ పోలీసులు దాడి చేసి అక్కడ వున్న 8 మందిని అరెస్టు చేశారు. మొదట పద్మారావు నగర్ లో మకాం వేసిన వీరంతా ముందు జాగ్రత్త చర్యగా ఎం.సి. గార్డ్స్ కు మకాం మార్చారు. వీరి అరెస్టుతో బెతానీ హోం నిర్వాహకురాలు సావిత్రమ్మ ఆచూకీ తెలుస్తుందని పోలీసులు ఆశిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిన్నపిల్లల విక్రయ బాగోతానికి రాష్ట్ర హో శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ సొంత నియోజక వర్గమే వేదిక కావడం విశేషం.