దత్తత కేంద్రాల్లో అవయవాల అమ్మకం?
హైదరాబాద్ః దత్తత కేంద్రాల్లో పసిపిల్లల అమ్మకం కుంభకోణానికి మరో కోణం వచ్చి చేరింది. ఈ కేంద్రాల్లో చిన్న పిల్లల అవయవాలను కూడా అమ్ముతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత వారం ఒక దత్తత కేంద్ర నుంచి స్వాధీనం చేసుకున్న శారద అనే బాలికను ఒక కంటి ఆస్పత్రిలో చేర్చిన దరిమిలా పోలీసులకు ఈ అనుమానం వచ్చింది.
శారద పుట్టు గుడ్డి అయి ఉండదని ఆమె కంటి పై పొర కార్నియాను దత్తత కేంద్రం వాళ్ళు అమ్ముకుని ఉంటారన్న కోణం నుంచి పొలీసులు కొత్తగా విచారణ ప్రారంభించారు. శారదను తాండూరులోని జాన్ బెతానీ హోం నుంచి గత వారం కంటి ఆస్పత్రికి తరలించారు. శారద కంటి పొరను తొలగించి అమ్ముకుని ఉంటారన్న అనుమానాన్ని డాక్టర్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గత వారం రాష్ట్రంలోని వివిధ దత్తత కేంద్రాల మీద దాడి చేసి 183 మంది బాలబాలికలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 20 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇలా ఉండగా చిన్న పిల్లల అక్రమ అమ్మకాల కేసులో ఉన్న సీనియర్ ఐపిఎస్ అధికారి భార్య త్వరలో పోలీసులకు లొంగిపోనున్నట్టు తెలిసింది.