జోరుగా సంతకాల సేకరణ
హైదరాబాద్: ఎన్డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిసిసి ప్రారంభించిన సంతకాల సేకరణ ఉద్యమం జోరుగా సాగుతున్నది. బుధవారం రెండోరోజు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పిసిసి నేత ఎం సత్యనారాయణరావు స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్టానవర్గం తనపట్ల అసంతృప్తితో వున్నదన్న వార్తలను ఆయన ఖండించారు. తాను ప్రజాస్వామ్యపద్దతిలో ఎన్నికైన నాయకున్నని ఆయన వెల్లడించారు. పార్టీ నాయకత్వం పిసిసి నేతలను చిత్తానుసారంగా మార్చే అవకాశం వున్నదనుకోవడం పొరపాటని ఆయన వివరించారు. తహల్కా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో తాము ఎక్కుపెట్టిన ఉద్యమానికి అసాధారణ రీతిలో ప్రజలనుంచి ప్రతిస్పందన కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్డిఎ ప్రభుత్వం రాజీనామా చేయాలని కోరుతూ సేకరించిన సంతకాలతో ఒక విజ్ఞాపన పత్రాన్ని ఈ నెల 20వ తేదీన తాము రాష్ట్రపతి కెఆర్ నారాయణన్కు సమర్పించనున్నట్టుగా ఆయన వెల్లడించారు