అమెరికా మాంద్యం ప్రభావం భారత్ పై నిల్
న్యూఢిల్లీః అమెరికా ఆర్థిక రంగంలో నెలకొన్న మాంద్యం ప్రభావం భారత ఆర్థికరంగంపై లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. భారత్ ఈ సారి ఆరు శాతం అభివృద్ధి రేటు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించి వచ్చిన సిన్హా గురువారం కొత్తఢిల్లీలోవిలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సమావేశాలలో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళిన సిన్హా పలువురు అమెరికా ప్రముఖులను కలుసుకున్నారు.
భారత ఆర్థిక రంగానికి ముప్పు వాటిల్లబోతున్నదంటూ వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. గతంలో కంటే మెరుగైన ఆర్థిక పనితీరును భారత్ సాధించనున్నదని ఆయన చెప్పారు.
అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ ఆ ప్రభావం భారత్ పై అంతగా వుండదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థిక మాంద్యం ప్రభావం పడని ఆసియా దేశాల జాబితాలో భారత్ కూడా వుంటుందని, ఆర్థికస్వావలంబనే ఇందుకు కారణమని ఆయన చెప్పారు.
అత్యంత శక్తివంతమైన మార్కెట్ వ్యవస్థ కలిగిన భారత్ మరింత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. సరళీకృత ఆర్థిక విధానాలు భారత్ కు ఎంతో మేలు చేశాయని ఆయన వ్యాఖ్యానించారు.