రైతుల ధర్నాలు, రాస్తారోకోలు
హైదరాబాద్: అధికారుల తీరుపై ఆగ్రహించిన రైతులు గురువారం మెదక్ జిల్లా సిద్ధిపేటలో, నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆందోళనకు దిగారు. సూర్యాపేటలో పాక్షిక బంద్ జరిపారు. సిద్ధిపేటలో రాస్తారోకో, ధర్నా చేశారు. లెవీ బియ్యం కొనడాన్ని అధికారులు ఆపేయడంతో సిద్ధిపేట మార్కెట్ యార్డులో వ్యాపారులు కూడా ధాన్యం కొనుగోళ్లను నిలిపేశారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభం కావాల్సిన బీట్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా మొదలు కాలేదు. దీంతో రైతులు రాస్తారోకోకు దిగారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. మార్కెట్ కార్యాలయాన్ని ధ్వంసం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు.
అధికారులు దిగి వచ్చి లేవీ బియ్యం కొనడానికి సిద్ధపడడంతో సాయంత్రం ఐదున్నర గంటలకు కొనుగోళ్లు మొదలయ్యాయి. ఆ వెంటనే మద్దతు ధర పలకలేదనే కారణంతో రైతులు ఇద్దరు వ్యాపారులపై దాడికి దిగారు. దీంతో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో రైతుల ఆందోళన గురువారం కూడా కొనసాగింది. బుధవారం అరెస్టు చేసిన 8 మంది రైతులను విడుదల చేయాలంటూ రైతులు గురువారం ఉదయం నుంచే ఆందోళనకు దిగారు. ఉదయం ఐదు గంటలకే వర్షం వస్తున్నా లెక్క చేయకుండా విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించారు. గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు రంగంలోకి దిగి రైతులకు నచ్చజెప్పారు. ఆ తర్వాత సూర్యాపేట పట్టణంలోని దుకాణాలను బంద్ చేయించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.