భారీ భద్రత మధ్య పోలింగ్
న్యూఢిల్లీ: భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అయిదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. అస్సాం మినహా మిగిలిన నాలుగురాష్ట్రాలు తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ సారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఉపయోగిస్తున్నారు.
అస్సాంలో మాత్రం ప్రయోగాత్మకంగా కొన్ని కేంద్రాల్లోనే ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్లను ఉపయోగిస్తున్నారు. మధ్యాహ్నం వరకు అందిన సమాచారాన్ని బట్టి పోలింగ్ ప్రశాంతంగానే సాగుతున్నది. సుమారు 40 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా వార్తలు అందాయి. అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు. పశ్చిమబెంగాల్ అధికార వామపక్ష ప్రభుత్వం పెద్దఎత్తున రిగ్గింగ్కు పాల్పడుతున్నట్టుగా పోలింగ్ ప్రారంభమైన కొన్నిగంటల్లోనే కాంగ్రెస్, తృణమూల్ నేతలు ఆరోపించారు. రెండు మూడు జిల్లాల్లో సాగుతున్న రిగ్గింగ్ వ్యవహారాన్ని తాము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
బెంగాల్లో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో పెద్దఎత్తున భద్రతాదళాలను మొహరించారు. అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదుల హింసాకాండ పెరిగిన దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. కేరళలో లెఫ్ట్ఫ్రంట్ కూటమికి కాంగ్రెస్ నాయకత్వంలోని డెమొక్రటిక్ ఫ్రంట్కు మధ్య సాగుతున్న పోరులో లెఫ్ట్ పరిస్థితి కొంత బలహీనంగా వున్నదని అంటున్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి కరుణానిధి ఇవే తన ఆఖరు ఎన్నికలని మరోసారి ప్రకటించి ఓటర్ల సానుభూతిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు.