రచయిత ఆర్కె నారాయణ్ కన్నుమూత
చెన్నై: సుప్రసిద్ద రచయిత రాసిపురం కృష్ణస్వామి నారాయణ్ ఆదివారం నాడు చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. గుండెకు సంబంధించిన సమస్యలతో ఏప్రిల్ 27న ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. ఇంగ్లీష్లో రచనావ్యాసాంగం సాగించిన తొలితరం భారతీయ రచయితల్లో ఆర్కె నారాయణ్ లబ్ధప్రతిష్టులు.
సుప్రసిద్ధ కార్టూనిస్టూ ఆర్కె లక్ష్మణ్ ఆయన సోదరుడు. మాల్గుడి పట్టణం, స్వామి పాత్రల సృష్టికర్తగా సాహిత్య చరిత్రలో చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకున్న నారాయణ్ 34 పైగా నవలలు రాశారు. వీటిలో పాపులర్ నవలలుగా వన్నెకెక్కిన బాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ది మాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి, ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, మాల్గుడి డేస్ వున్నాయి. మాల్గుడి డేస్, స్వామి అండ్ హిస్ ఫ్రెండ్స్ నవలలను ప్రముఖ కన్నడ దర్శకుడు శంకర్నాగ్ బుల్లితెర దృశ్యకావ్యాలుగా మలిచారు. నారాయణ్ మరో పాపులర్ నవల ది గైడ్ ను 1962లో దేవానంద్ అదే పేరుతో సినిమాగా తీశారు. ఈ నవలకే 1958లో సాహిత్యఅకాడెమి అవార్డు కూడా ఆయనకు లభించింది. 1964లోనే పద్మభూషణ్ ఆయన్ను వరించింది.