తెలంగాణపై దేశం తీర్మానాలు Home Full Story
కరీంనగర్: కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మినీ మహానాడులో తెలంగాణాకు సంబంధించి పలు ముఖ్యమైన తీర్మానాలు చేశారు. పేరుకు మినీమహానాడు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనానికి అడ్డుకట్టవేయాలనే ఉద్దేశ్యం వల్ల ఈ సభను భారీ ఎత్తున దేశం నేతలు నిర్వహించారు.
రెండు రోజుల పాటుజరిగిన ఈ సభల్లో కేవలం కరీంనగర్ జిల్లా సమస్యలను కాకుండా మొత్తం తెలంగాణ జిల్లాల సమస్యలను చర్చించారు. శ్రీరామ్సాగర్ వరదనీటి కాలువ నిర్మాణం సత్వరమే చేపట్టాలని, తెలంగాణా జిల్లాలో ఉన్నతవిద్యకు సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేశారు. తెలంగాణలో ఐఐటి ఏర్పాటుకు కేంద్రంపై వత్తిడి తేవల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించారు. టిఆర్ఎస్మరో రెండు మూడు రోజుల్లో కరీంనగర్లో సింహగర్జన సదస్సు నిర్వహిస్తున్న దృష్ట్యా తమ పార్టీ క్యాడర్ అటువైపు మొగ్గకుండా చూడాలన్న తాపత్రయం దేశం నేతల్లో కనిపించింది.
తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎవరూ తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆసక్తి చూపడం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లాల్జాన్ బాషా పేర్కొన్నారు. స్థానికంగా వుండే విభేదాల కారణంగా కొందరు కార్యకర్తలు తెలంగాణ సమితి వైపు మొగ్గు చూపిస్తున్నారని అంతే తప్ప మిగిలిన కార్యకర్తలు ఎవరూ టిఆర్ఎస్ గురించి ఆలోచించడం లేదని ఆయన చెప్పారు. ఈ మహానాడులో రానున్న పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను గురించి కూడా చర్చించారు.