ఐఐఐటి ఎంట్రెన్స్ పేపర్ లీక్!
హైదరాబాద్: హైదరాబాద్లోని ప్రతిష్టాత్మకమైన త్రిబుల్ఐటి ఎంట్రెన్స్ పరీక్ష పత్రాలు లీక్ అయినట్టుగా వెల్లడికావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం నాడు లక్నోలోని రెండు కోచింగ్ సెంటర్లపై దాడి చేసి ఐఐఐటి ఎంట్రెన్స్ పేపర్లను నింపుతున్న 12 మంది విద్యార్ధులను అరెస్టు చేశారు.
ఈ విద్యార్ధులంతా యుపిలోని అత్యున్నత స్థాయి అధికారుల పిల్లలు కావడం గమనార్హం. మాధ్స్, ఫిజిక్స్ పేపర్లను ఔట్ చేసిన ఈ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అభ్యర్దులతో ఒరిజనల్ పత్రాలను తమ ఇనిస్టిట్యూట్లోనే నింపించి ఆ తర్వాత వాటిన ఎగ్జామ్ సెంటర్లో ఇదే విద్యార్ధులకు ఇచ్చే పేపర్స్తో మార్చడానికి పథకం వేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ పరీక్ష పత్రాల లీక్ రాకెట్లో ఐఐఐటి అధికారులు, ఇన్వెజిలేటర్లు, కోచింగ్ సెంటర్ల నిర్వహకుల హస్తం వున్నట్టుగా వారు వెల్లడించారు. కాగా దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించిన ఐఐఐటి సంస్థ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంపై దర్యాప్తునకు ముగ్గురు అధికారుల బృందాన్ని లక్నోకు పంపింది. ఈబృందం నివేదిక ఆధారంగా ఎంట్రెన్స్ పరీక్షను రద్దు చేసే విషయం నిర్వహిస్తామని సంస్థ అధికారులు చెప్పారు.