తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఛలోఢిల్లీ
హైదరాబాద్ః ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభించేందుకు ఇదేసరైన సమయం అని కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణాకు చెందిన ఎమ్మెల్ల్యేలు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యం ప్రారంభించాల్సిందిగా అధిష్టానాన్ని ఒప్పించేందుకు సోమవారంపెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలు కొత్త ఢిల్లీ బయలు దేరారు.
తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేల బృందానికి సీనియర్ పార్టీ నేత ఇంద్రకరణ్ రెడ్డి సారధ్యం వహిస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణా ఉద్యమాన్ని చేపట్టేందుకు అనుమతించాల్సిందిగా వారు సోనియా గాంధీని కలుసుకొనివిజ్ఞప్తి చేస్తారు. సోనియా గాంధీతో పాటు సీనియర్ పార్టీ నేతలను కూడా వారు కలుసుకుంటారు.
పలు రాష్ట్రాలలో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని చేపట్టేందుకు ఇదే తగిన సమయం అని తెలంగాణా కాంగ్రెస్ ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా తెలంగాణాకు తీరని అన్యాయం జరుగుతున్నదని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే మంచి అన్నదమ్ముల్లా విడిపోతామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఉద్యమాన్ని చేపడితే ఎంతో లాభదాయకంగా వుంటుందని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంపై ప్రజలను చైతన్య వంతుల్ని చేసేందుకు త్వరలో జిల్లాలలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు పురుషోత్తం రెడ్డి చెప్పారు.