వర్మకు బెయిలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ మాజీ చైర్మన్ బిపి వర్మకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. 5 లక్షల రూపాయల నగదు, అంతేమొత్తానికి పూచీకత్తుపై ఆయనకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వర్మతో పాటు అరెస్టయిన ఆయన కుమారుడు సిద్ధార్ధవర్మ, మరో యువతి భావనపాండే లకు రెండు లక్షల రూపాయల పూచీకత్తుపై బెయిల్మంజూరు చేశారు.
సిద్ధార్థవర్మ సహచరుడు రాజీవ్ శర్మకు 50 వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరయింది. చెన్నైకు చెందిన ఒక సంస్థనుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలపై వర్మను ఏప్రిల్ 2 పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. అవినీతి ఆరోపణల దరిమిలా ఆయన ఇంటిపై కార్యాలయంపై కూడా పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో వర్మ ఆయన కుమారుని పేరుపై కోటి రూపాయల విలువజేసే ఆస్తులు వున్నట్టుగా వెల్లడయింది. మరో మూడు కోట్ల రూపాయలమేర బ్యాంకు లాకర్లు, ఖాతాల్లో వున్నట్టుగా బయటపడింది.