ఆరునెలల్లో అసెంబ్లీకి: జయ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరునెలల్లో అసెంబ్లీకిఎన్నికకావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు ఏలాంటి అనుమానాలు లేవని ఆమె అన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరునెలల్లో ఆమె ఎన్నికకావల్సివున్న విషయం విదితమే. ఈ విషయం చట్టపరమైన సమస్యలు వుంటే వాటి సంగతి తమ న్యాయనిపుణులు చూసుకుంటారని ఆమె అన్నారు.
బుధవారం నాడు ఆమె తన రాజకీయ గురువు, దివంగతనేత ఎంజిఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు వుంచి శ్రద్దాంజలి ఘటించారు. ఎన్నికల్లో పోటీకి నామినేషన్ను అధికారులు తిరస్కరించినప్పటికీ సర్కారు ఏర్పాటుకు గవర్నర్ తనను ఆహ్వానించడాన్ని ఆమె గట్టిగా సమర్ధించారు. గవర్నర్ ఫాతిమాబీ స్వయంగా న్యాయనిపుణురాలని, ఆమె సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అన్న విషయం మర్చిపోరాదని ఆమె తెలిపారు. పాండిచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు తమ పార్టీ మద్దతునిస్తుందని ఆమె తెలిపారు.