పోలీసుగస్తీతో మాయమైన ఢిల్లీ వానరం!
న్యూఢిల్లీః మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ నగర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వింతజంతువు కథ సుఖాంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వానరం ఆకారంలో వున్న ఈ వింత జంతువు గత మూడు రోజులలో ఢిల్లీలో 50 మందిని గాయపరచినవిషయం విదితమే.
రాత్రిళ్ళు డాబాల మీద పడుకున్న వారిపై ఒకే సారి పలుచోట్ల దాడులు జరగడంతో పలు జంతువులు నగరంపై దాడి చేసినట్లు భావించారు. దీనితో వెయ్యి మంది పోలీసులు లైట్ పిస్టల్స్ ధరించి మంగళ, బుధవారాలలో రాత్రంతా పహారాకాశారు. వారికి ఆ వింత జంతువు కనిపించలేదు.పైగా వింత జంతువులు దాడి చేశాయంటూ వచ్చే ఫిర్యాదులు కూడా తగ్గడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
అసలు అది జంతువే కాదని అసాంఘిక శక్తులు ఢిల్లీలోఅరాచకం సృష్టించేందుకు ఈ పని చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. జంతువులు అలా దాడి చేసి మాయం కావని, ఎవరైనా ఎదురు పడితే మరింత ప్రతిఘటిస్తాయని జూ అధికారులు చెబుతున్నారు. ఈఅంశాలను పరిశీలిస్తే మొత్తం మీద మూడు రోజుల పాటు ఢిల్లీ వాసుల్ని బెంబేలెత్తించింది వింతజంతువు కాదనిఅసాంఘిక శక్తులే ఇలా అరాచకం సృష్టించాయనే అనుమానం రూఢి అవుతున్నది.
-
ఢిల్లీలో
కిష్కింధకాండ-వెయ్యిమంది
పోలీసుల
వేట