పాండి నేతగా షణ్ముగం
పాండిచ్చేరి: పాండిచ్చేరి కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, ప్రస్తుత ముఖ్యమంత్రి షణ్ముగంనే సిఎల్పి నేతగా శనివారం నాడు మళ్లీ ఎన్నుకున్నారు. పాండి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్ కూటమి అన్నాడిఎంకె మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే.
అయితే కొత్త నేత ఎంపిక విషయంలో షణ్ముగంకు పోటీగా వైద్యలింగం, నారాయణస్వామి వగైరాలు బరిలోకి దిగడంతో అధిష్టానవర్గానికి తలనొప్పి ప్రారంభమయింది. ఎఐసిసి దూతలుగా వచ్చిన గులాంనబి ఆజాద్, మోతిలాల్ వోరా ఎమ్మెల్యేలతో మాట్లాడి ఏకాభిప్రాయ సాధనకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వదిలిపెడుతూ, సిఎల్పి తీర్మానం చేసింది. దూతలతో సంప్రదించిన సోనియా నూతన సారధిగా షణ్ముగం పేరును ఖరారుచేశారు. అయితే షణ్ముగం ఎంపికకు నిరసనగా వైరి వర్గం నేత వైద్యలింగ అనుచరులు బీభత్సం సృష్టించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయని షణ్ముగంను సిఎల్పి నేతగా ఎన్నుకోవడం పట్ల వారు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.