నలుగురు హైదరాబాదీల దుర్మరణం
హైదరాబాద్: పంజాబ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన నలుగురు కాంట్రాక్టర్లు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర భారత తీర్ధయాత్రలకని వెళ్లిన హైదరాబాద్ కాంట్రాక్టర్ల అసోసియేషన్కు చెందిన 17 మంది సభ్యుల బృందం ఆదివారం నాడు రోడ్డు ప్రమాదానికి గురయింది.
ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి రెండు సుమో వాహనాల్లో జమ్మూలోని వైష్ణవిమాత ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరిన ఈ బృందం జలంధర్-పటాన్కోట్ రోడులోని ముఖేరియా వద్ద ప్రమాదానికి గురైంది. రెండు సుమోల్లో ఒకదాన్ని ఎదురుగా వస్తున్న హర్యానా రోడ్డు రవాణా సంస్థ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వడ్డెర సంక్షేమ సంఘం నాయకుడు, బల్డియా కాంట్రాక్టర్ సాయులు, సిఎస్ ప్రకాష్రావు, టి పెద్దిరాములు, సురేందర్ వున్నారు. గాయపడిన వారిని జలంధర్ ఆస్పత్రిలో చేర్చారు.