కేంద్ర ప్రతిపాదనకు బాబు నో
న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ వికేంద్రీకరణ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యతిరేకించారు. ధాన్యం సేకరణను వికేంద్రీకరించనున్నట్లు ప్రధాని వాజ్పేయి సోమవారం ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబుతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వ్యతిరేకించారు. ధాన్యం సేకరణ వికేంద్రీకరణ ఆచరణ సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నప్పుడు ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని ఆయన అన్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్సిఐ) సమర్థంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నిత్యావసర సరుకలు జాబితాను ఎప్పటికప్పుడు సవరించాలని, వ్యవసాయ ప్రాధాన్యతా మండలాలను గుర్తించాలని కూడా ఆయన సూచించారు.
ధాన్యం సేకరణ వికేంద్రీకరణకు ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రధాని వాజ్పేయి చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో) ఒప్పందం వల్ల రైతులకు ఏ విధమైన నష్టం కలుగదని ఆయన అన్నారు. తన ప్రభుత్వం రైతు ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి వుందని ఆయన చెప్పారు. డబ్ల్యుటివో ఒప్పందం రైతు ప్రయోజనాలపై గొడ్డలి పెట్టు వంటిదనే విమర్శలు అర్థరహితమని ఆయన అన్నారు.