కాంగ్రెస్ ఫోరం ప్రజాగర్జన
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర సమితి నిర్వహించిన సింహగర్జన సదస్సుతో ఈ పోరాటంలో తామెక్కడ వెనకబడిపోతామోనన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్నది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు మద్దతునివ్వాలని అధిష్టానవర్గాన్ని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ ఫోరం, జూన్ 4న మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో పాలమూరు ప్రజాగర్జన పేరుతో భారీ ఎత్తున సభ నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నది.
జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి ప్రజలను ఈ సభకు సమీకరిస్తారు. జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎంపి మల్లు రవి, మల్లికార్జున్, మాజీ మంత్రి పులివీరన్న, జిల్లాకు చెందిన ఇతర సీనియర్ నేతలు నర్సిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డి, డిసిసి నేత జగదీశ్వర్రెడ్డి తదితరులు హాజరవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో ప్రజలను జాగృతం చేసేందుకు తాము ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సభలో కాంగ్రెస్ తెలంగాణా లెజిస్లేచర్ ఫోరం తరఫున తాము కాంగ్రెస్ పార్టీ మధ్యలో తెలంగాణా మ్యాప్ వున్న మూడు రంగుల ప్రత్యేక పతాకాన్ని ప్రజల సమక్షంలో విడుదల చేస్తారు.