అడుగడుగునాఫిక్సింగ్-క్రికెట్ ఓ ఫార్స్
లండన్ః ప్రపంచ క్రికెట్ మ్యాచ్ఫిక్సింగ్ గుప్పెట్లో విలవిలలాడి పోతున్నదని మ్యాచ్ఫిక్సింగ్ పై దర్యాప్తు జరిపిన పాల్ కాండన్ స్పష్టం చేశారు. భారత దేశానికి చెందిన మహ్మద్ అజారుద్దీన్, దక్షిణాఫ్రికా కు చెందిన హాన్సీ క్రోనే, పాకిస్తాన్ కు చెందిన సలీమాలిక్ లపై మ్యాచ్ఫిక్సింగ్ కు పాల్పడుతున్నందుకు గాను జీవితకాల నిషేధం విధించినప్పటికీ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్ లో మ్యాచ్ఫిక్సింగ్ కొనసాగుతున్నదని ఆయన తేల్చి చెప్పారు.
మ్యాచ్ఫిక్సింగ్ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించిన అంతర్జాతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు అవినీతి నిరోధక విభాగం అధినేత పాల్ కాండన్ బుధవారం విడుదల చేసిన నివేదికలో సంచలనాత్మకవిషయాలు బయట పెట్టారు. అయితే పాల్ కాండన్ తన నివేదికలో మ్యాచ్ఫిక్సింగ్ కు పాల్పడుతున్న ఆటగాళ్ళ పేర్లు మాత్రంపేర్కొనలేదు. క్రికెట్ ను మ్యాచ్ ఫిక్సింగ్ జాడ్యం 1970 నుంచి పట్టి పీడిస్తున్నదని ఆయన చెప్పారు. మ్యాచ్ఫిక్సర్లు ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడని వారని ఆయన తెలిపారు.
మ్యాచ్ ఫిక్సింగ్ లు, బెట్టింగ్ లు ప్రపంచ క్రికెట్ ను ఏ విధంగా కుదిపి వేస్తున్నది, మ్యాచ్ లలో ఏ ఏ దశల్లో మ్యాచ్ఫిక్సింగ్ జరుగుతున్నది ఆయన సవివరంగా తన నివేదికలోపేర్కొన్నారు. చాలా మంది క్రికెటర్లకు మ్యాచ్ ఫిక్సిగ్ గురించి తెలిసినప్పటికీ నోరు విప్పితే తమ నోళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాతాయేమో అనే భయంతో మౌనం వహించారని కాండన్ స్పష్టం చేశారు.
కొందరు క్రికెటర్లు అడ్డదారులు తొక్కారనేందుకు మా వద్ద సాక్ష్యాధారాలున్నాయని కాండన తేల్చి చెప్పారు. అయితే వారి పేర్లను మాత్రం కాండన్ తన నివేదికలో పేర్కొనలేదు.రెండేళ్ళ కిందట ఢిల్లీ పోలీసులు టెలిఫోన్ సంభాషణను రికార్డు చేయడంతో క్రికెట్ ప్రపంచంలో మ్యాచ్ ఫిక్సింగ్ బండారం బయట పడింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రోనే తన తప్పు ఒప్పుకోవడంతో అతనిని క్రికెట్ నుంచి జీవితకాలం నిషేధించారు. భారత ప్రభుత్వం కూడా మ్యాచ్ ఫిక్సింగ్ పై దర్యాప్తు చేసి అజరుద్దీన్, అజయ్ శర్మలపై జీవితకాల నిషేధాన్ని, అజయ్ జడేజా, మనోజ్ ప్రభాకర్ పై ఐదేళ్ళ నిషేధంవిధించిన విషయం విదితమే.
ఫిక్సింగ్
కొండంత-తెలిసింది
గోరంత!