మనాలీ లో వాజ్పేయి విశ్రాంతి
సివ్లూః రాజకీయ తలనొప్పులకు దూరంగా ప్రధాన మంత్రి వాజ్పేయి విశ్రాంతి కోసం హిమాలయ పర్వత పాదాల్లో వున్న సుందర ప్రదేశమైన మనాలీ చేరుకున్నారు. ఆయన నాలుగు రోజుల పాటు ఇక్కడ వుంటారు. ఈ నాలుగు రోజుల్లో ఆయన ఎటువంటి అధికార కార్యక్రమాలు చేపట్టరు.
గురువారం ఉదయం 11 గంటలకు మనాలీ చేరుకున్న వాజ్పేయికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సూరజ్ భాన్, ముఖ్యమంత్రి దుమాల్స్వాగతం చెప్పారు. మనాలీలో విశ్రాంతి అనంతరం ప్రధాని ఈ నెల 30న కొత్తఢిల్లీ తిరిగి వెళతారు. అంతకు ముందు డిసెంబర్ లో ప్రధాని కేరళలోని కుమరక్కం రిసార్ట్స్ లో వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు.
పాకిస్తాన్ తో చర్చలకు సిద్ధం అని బుధవారం ప్రకటించిన వాజ్పేయి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ వ్యవహారం పైమిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఈ వ్యవహారంతో పాటు మణిపూర్వివాదం, ఎన్డీఏ మిత్రుల వేధింపులు, సాధింపులకు దూరంగా ఓ నాలుగు రోజుల పాటు విశ్రాంతిగా గడపాలని వాజ్పేయి నిర్ణయించుకున్నారు. జూన్ మొదటి వారంలో మోకాలి శస్త్ర చికిత్స చేసుకోనున్న వాజ్పేయికి విశ్రాంతి అవసరం అని వైద్యులు కూడా సూచించారు.