కలసివుంటే రాష్ట్రం హస్త గతం
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు పరస్పర కలహాలతో ఢిల్లీ చుట్టు ప్రదక్షిణలు చేయకుండా కలసికట్టుగా వుంటే రాష్ట్రంలో అధికారాన్ని అవలీలగా హస్తగతం చేసుకోవచ్చని పిసిసి నేత సత్యనారాయణరావు, సిఎల్పి నేత వైఎస్ పేర్కొన్నారు. పిసిసి నేతగా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సత్యనారాయణరావుకు శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్లో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏడాది కాలంలో తాము చేపట్టిన ఉద్యమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరి విమర్శలు ఎలా వున్నా, తన నాయకత్వం పట్ల పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిందని తనకు కావల్సింది అదేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు కలసికట్టుగా వుంటే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పరం కావడం ఖాయమని వైఎస్ రాజశేఖర్రెడ్డి అన్నారు. ఈ సన్మాన సభకు దాసరి, టి సుబ్బరామిరెడ్డి హాజరయ్యారు. కాగా కోట్ల, నేదురుమల్లి, విహెచ్ వంటి కొందరు నేతలు రాకపోవడం పై కార్యకర్తలు చర్చించుకోవడం వినిపించింది.