బాబ్రీ కమిషన్ ఎత్తివేయండి
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేతకు దారి తీసిన పరిస్థితులు, దానివెనక ఏదైనా కుట్ర వున్నదా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ లిబర్హన్ కమిషన్ను ఎత్తివేయడం ఉత్తమమని బిజెపి అభిప్రాయపడింది. 1992లో బాబ్రీ విధ్వంసం తర్వాత ఏర్పాటయిన ఈ కమిషన్ ఇంతవరకు ఏమీ సాధించలేకపోయిందని బిజెపి నేత జెపి మాథుర్ వ్యాఖ్యానించారు.
కమిషన్ ఏర్పాటయినప్పుడు మూడు నెలల్లో నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిందని అయితే కమిషన్ ఎప్పటికప్పుడు గడువు పెంచమని కోరుతూ వస్తున్నదని బిజెపి ఎంపి వినయ్ కటియార్ అన్నారు. కమిషన్ విచారించే సాక్షుల సంఖ్య హనుమంతుని వాలంలా పెరుగుతూ పోతున్నదని ఆయన అన్నారు.
లిబర్హన్ కమిషన్ ఎత్తివేయాలని గతంలో విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసినప్పటికీ బిజేపీ నోటినుంచి ఈ మాట రావడం ఇదే మొదటి సారి.బిజెపి డిమాండ్పై ముస్లీం నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కమిషన్ తన దర్యాప్తును పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ముస్లీం నేతలు కోరుతున్నారు. కమిషన్ దర్యాప్తు ఇప్పుడు కీలక దశలో వున్నదని అనేకమంది బిజెపి అగ్రనేతలను కమిషన్ విచారిస్తున్నదని వారు పేర్కొన్నారు. ఈ దశలో కమిషన్ సాధించగల పరమార్ధం ఏమీలేదని బిజెపి నేతలు ప్రకటించడం పట్ల వారు అనుమానాలు వ్యక్తం చేశారు.