ఎన్డిఎ పై వత్తిడికి సిద్ధం
విశాఖపట్నం: కేంద్ర-రాష్ట్ర సంబంధాలు విదేశాంగ విధానంపై తెలుగుదేశం మహానాడు చేయనున్న కీలక తీర్మానాలకు అనుగుణంగా తాము కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వంపై పార్లమెంటరీ పార్టీ ద్వారా వత్తిడి తెస్తామని టిడిపిపి నేత ఎర్రన్నాయుడుచెప్పారు.
కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో తెలుగుదేశం వైఖరికి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయని ఆయన అన్నారు. ఎన్డిఎ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు కూడా ఈ విషయంలో మహానాడు తీర్మానాలను ఆసక్తితో గమనిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సర్కారియా కమిషన్ సిఫారసుల అమలువల్ల రాష్ట్రాలకు అధికారాలు పెరిగినా, ఈ అధికారాలు సరిపోవని ఎర్రన్నాయుడు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర భవిష్యత్తుకు తగిన విధంగా పథకాలను సిద్ధం చేసుకుని ఎలాంటి అవరోధాలు లేకుండా అమలు చేసుకునే అవకాశం వుండాలని ఆయన చెప్పారు. విదేశాంగ విధానాల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి విస్పష్టమైన అభిప్రాయాలు వున్నాయని వాటిపై కూడా మహానాడు తీర్మానాలు చేయనున్నదని ఆయన వెల్లడించారు.