బీసీ రిజర్వేషన్లు మరో పదేళ్లు
విశాఖపట్నం: వెనకబడిన వర్గాల వారికి స్థానిక సంస్థల్లో వున్న రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం మహానాడు వేదికపై ముఖ్యమంత్రి, తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నెల 30న జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
సోమవారం నాడు రిజర్వేషన్లను మరోపదేళ్లపాటు పెంచాలని కోరుతూ మహానాడు ఒక తీర్మానం చేసింది. జూన్ 30 తో ముగుస్తున్న రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ ఈ తీర్మానాన్ని అనంతపురం ఎంపి కాలువ శ్రీనివాసులు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరుతూ మరో తీర్మానం కూడా చేశారు. ప్రత్యేక తెలంగాణా విషయంలో ఇప్పటివరకు నోరు విప్పని చంద్రబాబు నాయుడు మహానాడులో తొలిసారిగా తెలంగాణాను ప్రస్తావించారు. అయితే టిఆర్ఎస్ నేత చంద్రశేఖర్రావు పేరును ప్రస్తావించకుండా ఆయన కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు.
తెలంగాణా వెనకబాటుతనానికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. అన్ని వనరులూ వున్నా తెలంగాణా అభివృద్ధి చెందలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు వెనకబడి వుండటానికి కారణం ఈ రాష్ట్రాన్ని 40 ఏళ్లపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. వెనకబాటును సృష్టించడం తర్వాత దానిని తమ స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడం కాంగ్రెస్కు అలవాటనని ఆయన దుయ్యబట్టారు.