బాబు విమర్శకు వైయస్ ఖండన
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) తప్పు పట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణాను నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రత్యేక తెలంగాణోద్యమం తలెత్తిందని సిఎల్పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలలో ఒక ప్రాంతం సమస్యలను తీర్చలేనప్పుడు తమ పార్టీ వారే ఉద్యమించారని ఆయన అన్నారు.
రైతాంగ దుస్థితిపై సిఎల్పి ప్రచురించిన ఒక పుస్తకాన్ని రాజశేఖర రెడ్డి విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్లనే రైతాంగం పుట్టి మునుగుతోందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. భారతదేశంలో నిరుడు 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందులో మన రాష్ట్ర రైతులు 385 మంది వున్నారని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటని ఆయన అన్నారు. ఏడాది ఇప్పటికే 140 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు.
పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తున్నందున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట మార్చారని, ఇప్పుడు సబ్సిడీలుండాలంటున్నారని, డబ్ల్యుటివోకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అప్పులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనే ప్రభుత్వ విధానాన్ని ఆయన తప్పు పట్టారు.