ఎన్డిఎకు తృణమూల్ దూరం
కోల్కతా; తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ ఎన్డిఎ కూటమిలో చేరుతున్నట్టుగా వస్తున్న వార్తలను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ గురువారం నుంచి జరుపనున్న ఢిల్లీ పర్యటనలో ప్రధాని వాజ్పేయిని, హోం మంత్రి అద్వానీని కలుసుకుంటారని అయితే ఈ చర్చలకూ ఎన్డిఎలో చేరడానికి ఏలాంటి సంబంధం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి రిగ్గింగ్ గురించి, పాల్పడిన అక్రమాల గురించి, ఎన్నికల తర్వాత బెంగాల్లో తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి వివరించడానికి మాత్రమే ఆమె వాజ్పేయి, అద్వానీలను కలుసుకుంటారని తృణమూల్ నాయకుడు పంకజ్ బెనర్జీ చెప్పారు. ఎన్డిఎకు దూరంగా వుండాలని తమ విధానంలో ఏలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్డిఎలో చేరేందుకే మమత నాయకత్వంలో ప్రతినిధుల బృందం ప్రధానిని కలుసుకుంటున్నదన్న వార్తలు పూర్తిగా నిరాధారమని ఆయన పేర్కొన్నారు. మమత నాయకత్వంలో తొమ్మిది మంది ఎంపీలు, 12 మంది ఎమ్ఎల్ఎలు ప్రధానిని, హోమంత్రిని కలుసుకుంటారని ఆయన చెప్పారు.