ముంబాయిలో ఘోరఅగ్నిప్రమాదం
ముంబాయి: దక్షిణ ముంబాయిలోని భూలేశ్వర్లో వున్న నాలుగంతస్తుల భారీ భవనంలో గురువారం ఉదయం హఠాత్తుగా చెలరేగిన అగ్నిజ్వాలల్లో ఇద్దరు సజీవదహనం అయ్యారు. పాతిక మందిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు జెజె ఆస్పత్రికి తరలించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ భవనంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయని తెలిసింది.
పెద్ద సంఖ్యలో అగ్నిమాపక దళ సిబ్బంది 12 యంత్రాలతో అగ్ని జ్వాలలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకోకపోయివుంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా వుండేదని పోలీసులు చెప్పారు. ఎప్పుడూ రద్దీగా వుండే ప్రాంతంలోని ఈ నివాస సముదాయంలో ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వున్న అపార్ట్మెంట్లలో కూడా తీవ్ర భయాందోళనలు వ్యాపించాయి. ప్రమాద కారణం తెలియరాలేదు. కొంతమంది ఆభరణాల వ్యాపారులు ఈ భవనంలో నివాసం వుంటున్నారు. ఆస్తి నష్టం చాలా ఎక్కువగా వుంటుందని అంటున్నారు.