రగులుతున్న నేపాల్-ఐదుగురు మృతి
ఖాట్మండూః నేపాల్ లో కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మంగళవారం ఐదుగురు మృతిచెందారు. దీనితో నిరసనలతో అట్టుడుకుతున్న నేపాల్ లో సోమ,మంగళవారాల్లో మరణించిన వారి సంఖ్య 17కు చేరినట్లు పోలీసులు చెప్పారు. కర్ఫ్యూ విధించనప్పటికీ నేపాల్ రాజధానిలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతున్నది.
అనన్ నగర్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు, కాలోపుల్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించనట్లు పోలీసులు చెప్పారు. మంగళవారం కొన్ని గంటల పాటు కర్ఫ్యూ సడలించినప్పటికీ మరలా కర్ఫ్యూ కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. రాజకుటుంబం మరణంపై వాస్తవాలను వెల్లడించాలంటూ నేపాల్ ప్రజలు ముఖ్యంగా ఖాట్మండూ పట్టణ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. యువకులు ఆగ్రహంతో రాళ్ళు రువ్వడంతో పోలీసులు పలు చోట్లు కాల్పులు జరిపారు. ఖాట్మండూ ప్రజలు భయంగుప్పిట్లో విలవిలలాడుతున్నారు. పోలీసులకు అవకాశం చిక్కితే చాలు ప్రజలపై కాల్పులు జరుపుతున్నారని సామాన్య పౌరులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా నేపాల్ యువకులు వీధుల్లోకి వచ్చి తమను రెచ్చగొడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. రాజకుటుంబం మరణంతో సమసిపోతుందనుకున్న చిచ్చు ఇప్పటి వరకు 17 మందిని పొట్టనపెట్టుకోవడంతో ఖాట్మండూ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.